భగవంతుడి అనుగ్రహాన్ని పొందే తేలిక మార్గం ఇదే..!

 

భగవంతుడి అనుగ్రహాన్ని పొందే తేలిక  మార్గం ఇదే..!

 భక్తి -ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు చాలా వరకు భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. భగవంతుడి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నం కూడా చేస్తారు. కొందరు ద్యానం చేస్తారు, మరికొందరు ఉపాసన చేస్తారు, మరికొందరు ఎప్పుడూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే ఇలా ఎన్ని చేస్తున్నా భగవంతుడి అనుగ్రహం కలగడం లేదని వాపోతుంటారు. కానీ భగవంతుడి అనుగ్రహం కలగాలన్నా,  ఆ భగవంతుడిని దర్శించాలన్నా దానికి తేలిక మార్గం ఒకటుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుంటే..
 

సంతోషకరమైన మనస్సుతో మాత్రమే దేవుడిని చేరుకోగలమని,  ఆయన అనుగ్రహం పొందగలమని, ఆయన దర్శన భాగ్యం కలుగుుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. మనస్సు సంతోషంగా లేకపోతే ఆ భగవండి సాక్షాత్కారం కూడా సాధ్యం కాదట. కానీ నేటి కాలంలో ప్రతి చిన్న విషయానికి బాధపడటం చేస్తుంటారు. ఇది చాలామంది స్వభావంలా మారిపోయింది. మన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే ఏ సంఘటననైనా కష్టంగా, సమస్యగా  భావిస్తాము. కానీ మన ఇష్టానికి విరుద్ధంగా జరిగేది భగవండుని  దయగా,  మన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది అదే భగవంతుడి  సంకల్పంగా పరిగణించాలని గురువుల మాట. ఏదైనా ప్రతికూల పరిస్థితిని లేదా ఏదైనా కష్టాన్ని జరగరాని కష్టంగా  భావిస్తుంటాము. కానీ ఇలా ప్రతికూలంగా ఆలోచించడం మంచిది కాదట. మారాల్సింది పరిస్థితులు అనుకోకూడదు, మారాల్సింది మానవ స్వభావం.  సుఖాన్ని మంచిగా, దుఃఖాన్ని చెడ్డగా చూసే అలవాటును మానుకోవాలని చెబుతున్నారు.

ప్రపంచంలో బాధలు ఉన్నాయి, బాధలకు కారణాలు ఉన్నాయి, బాధలకు పరిష్కారాలు ఉన్నాయి.  అవి కూడా సాధ్యమే అని బుద్ధుడు చెప్పాడు. అంటే బాధలను అనుభవిస్తున్నట్టే వాటికి  పరిష్కారాలను కూడా  అనుసరించవచ్చు. దీన్ని సానుకూలంగా ఆలోచించేవారు,  సానుకూలంగా ఆచరించేవారికి ఆనందం ఎప్పటికీ ఉంటుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. ఆనందానికి కారణాలు ఉంటాయి, ఆనందం మాయమం అయితే దానికి గల కారణం కూడా ఉంటుంది.  బాధ ఉంటే, ఆనందం కూడా ఉంటుంది. దృక్పథం కొద్దిగా మారితే బాధను ఆనందంగా మార్చవచ్చు.

సుందరకాండ నుండి ఒక ద్విపద ఉంది..

రామచంద్ర గుణ వర్ణే లాగా
సునతహీ సీతా కర్ దుఃక భాగా||

సీతామాత చాలాదుఃఖంలో ఉన్నప్పుడు హనుమంతుడు రాముడి గుణాల గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు సీతమ్మ తల్లి దుఃఖం మాయమైపోయిందట. భగవంతుడి గురించి విన్నా, భగవంతుడిని స్తుతించినా దుఃఖం మాయమవుతుందని, భగవంతుడిని ఎప్పుడూ ధ్యానించే సాధువుల సహవాసంలో ఉంటే దుఃఖాలు మాయమవుతాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు.


ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనుకుంటే మంచి సహవాసం కలిగి ఉండాలని చెబుతారు. దుఃఖం పట్ల దృక్పథాన్ని మార్చుకోవాలి. జీవితంలో ఆనందాన్ని సృష్టించేది దుఃఖమే. దుఃఖం లేకపోతే భక్తి ఉండదు, భక్తులు ఉండరు, గురువులు ఉండరు, శిష్యులు ఉండరు,  గురు పూర్ణిమ వంటి పండుగలు ఉండవట. నిజానికి  ఆనందం దుఃఖం ద్వారానే సృష్టించబడుతుంది. దుఃఖం ఒక వ్యక్తిని స్పుహతో ఉంచుతుంది. ఆనందంలో ఉన్నప్పుడు మనిషి స్పృహలో ఉండడు. ఇంకా చెప్పాలంటే హాయిగా సుఖాలలో నిద్రపోతాడు. ఇలా స్పృహ లేకుండా నిద్రించే వ్యక్తి కంటే దుఃఖంతో స్పృహతో ఉండే వ్యక్తి ఉత్తముడు అని గురువుల మాట.

కోపం, కామం, దురాశ మనిషికి ఆనందం ఉన్నా సరే.. వాటిని అనుభవించకుండా చేస్తాయి. కోపం ఎదురైనప్పుడల్లా మాట్లాడటం ఆపడం మంచిది. అలాగే కామం మనిషి పతనానికి దారితీస్తుంది.  మనిషిలో ఏదైనా కామపు ఆలోచన వస్తే వెంటనే భగవంతుని స్మరణ చేసుకోవడం వల్ల కామాన్ని క్రమంగా నిగ్రహించుకోవచ్చు. అలాగే దురాశ మనిషిని చాలా దెబ్బతీస్తుంది. దురాశ సముద్రం లాంటిది. దానికి తృప్తి ఉండదు.  దురాశ ఎదురైనప్పుడు మనిషి ఓపిక పట్టడం చాలా ముఖ్యం.  ఓపిక మనిషి ఆలోచనను సరిచేస్తుంది. ఇవి మూడు జయించినప్పుడు మనిషిలో అహంకారం కూడా చాలా వరకు జయించవచ్చు.  దేవుడిని పొందాలన్నా, ఆయన దర్శనం, అనుగ్రహం కావాలన్నా అహంకారాన్ని వదలడమే ఉత్తమ మార్గం. ఏ వ్యక్తి తన మాటలతో ఇతరులను నొప్పించడం, విమర్శించడం చేయకూడదు. ఇవన్నీ సాధించే మనిషి దైవ అనుగ్రహానికి, ఆయనను చూడటానికి అర్హత పొందుతాడు.

                                            *రూపశ్రీ.